‘కనీస వేతనాల’ తీర్పును 4 వారాల్లో అమలుచేయండి | Telangana High Court orders to CS and Labour Departments | Sakshi
Sakshi News home page

‘కనీస వేతనాల’ తీర్పును 4 వారాల్లో అమలుచేయండి

Mar 9 2025 4:15 AM | Updated on Mar 9 2025 4:15 AM

Telangana High Court orders to CS and Labour Departments

సీఎస్, కార్మిక శాఖలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కనీస వేతనాలకు సంబంధించి గెజిట్‌ ప్రింట్‌ చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను 4 వారాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో సంబంధిత అధికారులంతా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది. ఐదేళ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్‌ విడుదల చేయాల్సి ఉండగా, 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ 2023లో పిల్‌ దాఖలు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకున్నాయని పిటిషన్‌ తరఫు న్యా యవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. కోటి మందికిపైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు.

వాదనలు విన్న సీజే ధర్మాసనం.. వెంటనే గెజిట్‌ ప్రింట్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ను ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీచేసింది. 6 వారాలు సమయం ఇచ్చినా అమలు చేయలేదంటూ పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించి.. ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement