HCA Scam: ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌రెడ్డి సస్పెన్షన్‌ | Telangana HCA Scam: Uppal CI Election Reddy Suspension | Sakshi
Sakshi News home page

HCA Scam: ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌రెడ్డి సస్పెన్షన్‌

Jul 17 2025 1:53 PM | Updated on Jul 17 2025 3:01 PM

Telangana HCA Scam: Uppal CI Election Reddy Suspension

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కామ్‌లో ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. దేవ్‌రాజ్‌కు సహకరించిన ఎలక్షన్‌రెడ్డి.. సీఐడీ సమాచారాన్ని ముందుగానే లీక్‌ చేశారు. సీఐడీ సమాచారాన్ని దేవరాజుకు ముందుగా లీక్ చేసినందుకు ఎలక్షన్‌రెడ్డిని సస్పెండ్‌ అయ్యారు.

మరోవైపు, హెచ్‌సీఐ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్‌ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా.. హెచ్‌సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్‌రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.

కాగా.. హెచ్‌సీఏ- ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వివాదం నేపథ్యంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు  కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్‌ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్‌ విధించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement