
సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇవ్వకపోవడంతో మార్కెట్ తరలింపు వ్యవహారం క్లిష్టతరమవుతోంది. కమీషన్ ఏజెంట్లు హైకోర్టు డబుల్ బెంచ్ను ఆశ్రయించడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో తరలింపు వ్యవహారం వాయిదా పడింది. మార్కెట్ను బాటసింగారం తరలించడానికి గత నెలరోజుల నుంచి అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. శుక్రవారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ చేపట్టగా అధికారులు కోర్టుకు కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ నెల 4వ తేదీ సోమ వారం వరకు మార్కెట్లో యథాతథస్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
చదవండి: దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్: నాడు అలా, నేడు ఇలా!
కోహెడలోనే సౌకర్యాలు కల్పించండి
బాటసింగారంలో సౌకర్యాలు లేవు. స్థలం కూడా సరిపోయే పరిస్థితి లేదని, కోహెడలోనే తమకు స్థలాలు కేటాయించి పూర్తి స్థాయిలో వసతులు కలి్పంచాలని కమీషన్ ఏజెంట్ల ప్రతినిధి సయ్యద్ అఫ్సర్ డిమాండ్ చేశారు. మార్కెట్ తరలింపును ఆరు వారాలు వాయిదా వేయాలని ఆయన కోరారు.