Telangana: స్థానిక పోరుకు రెఢీ! | Telangana govt preparing for local body elections | Sakshi
Sakshi News home page

Telangana: స్థానిక పోరుకు రెఢీ!

Jan 31 2025 1:06 AM | Updated on Jan 31 2025 8:06 AM

Telangana govt preparing for local body elections

ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

వచ్చే నెల 2న కులగణన నివేదిక సబ్‌ కమిటీ చేతికి.. 

దాన్ని పరిశీలించి 5న జరిగే కేబినెట్‌ భేటీకి అందజేయనున్న సబ్‌ కమిటీ

కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించి రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే చాన్స్‌ 

6 లేదా 7న అసెంబ్లీ ప్రత్యేక భేటీ నిర్వహించే యోచన 

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానించి కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు 

ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్‌ కోసం సర్కారు ఆదేశాలు 

ఒక్క స్థానంలో 3 వేల నుంచి 4 వేల మంది జనాభా 

ఉండేలా పునర్విభజన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఎస్‌ఈసీ

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్‌ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

వచ్చే నెల 5న కేబినెట్‌ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్‌ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. 

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. 
స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్‌ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. 

ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్‌ ప్రక్రియ మొదలు 
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్‌) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్‌’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. 

కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఎన్నికల ఏర్పాట్లలో ఎస్‌ఈసీ.. 
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. 

ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్‌ పత్రాల ప్రింటింగ్‌కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్‌ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్‌ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్‌ అధికారుల నియామకం, బ్యాలెట్‌ బాక్స్‌లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. 



సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? 
బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలా­లు, జిల్లా పరిషత్‌ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజ­ర్వే­షన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీ­లకు తక్కువగా, బీసీ­ల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నా­యి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చ­నే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement