ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రైతు డిస్కమ్పై రచ్చ
నివృత్తి చేయలేని స్థితిలో అధికారులు
అనుమతి ఇవ్వడం ఎలా?.. తలలు పట్టుకుంటున్న ఈఆర్సీ
వెయ్యి మంది సిబ్బందితో నిర్వహణ ఎలా?
30 లక్షల కనెక్షన్లపై నియంత్రణ ఉంటుందా?
ప్రజాభిప్రాయ సేకరణలో బోలెడు అనుమానాలు
ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రైతు డిస్కమ్పై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేయకుండా అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) భావిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లువెత్తిన విమర్శలను ఈఆర్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఆర్థిక, నిర్వహణతో పాటు డిస్కమ్ల మధ్య సమన్వయం ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై డిస్కమ్ అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారులే సరైన వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ ఎలా ఇవ్వాలో అర్థమవ్వక ఈఆర్సీ తలపట్టుకుంది.
తక్కువ సిబ్బందితో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉచిత విద్యుత్తో పాటు మరికొన్ని కనెక్షన్ల కోసం రైతు డిస్కమ్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ను కొత్త డిస్కమ్కు సీఎండీగా నియమించింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు డిస్కమ్లున్నాయి. వీటి పరిధిలోనే ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29,05,779 వ్యవసాయ పంపు సెట్లు, 489 భారీ లిఫ్టు పథకాలు, 99 హైదరాబాద్ మెట్రో కనెక్షన్లు, 1,132 మిషన్ భగీరథ కనెక్షన్లు, 639 తాగునీటి కనెక్షన్లను రెండు డిస్కమ్ల నుంచి తప్పించి మూడో డిస్కమ్ పరిధిలోకి తెస్తారు.
అంటే మొత్తంగా 29,08,138 కనెక్షన్లు రైతు డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. అనధికారికంగా ఉండే రైతు కనెక్షన్లు కలుపుకుంటే మొత్తంగా 30 లక్షల వరకూ ఉండే వీలుంది. ఇన్ని కనెక్షన్లకు కలిపి కేవలం 2 వేల మంది సిబ్బంది మాత్రమే నియమించారు. వీళ్ళలో వెయ్యి మంది విద్యుత్ కార్యాలయాల్లో పాలన విభాగంలో పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వెయ్యి మాత్రమే.
వీళ్ళలో చాలా వరకూ మండల కేంద్రాల్లో ఉంటారు. రైతు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, సాంకేతిక సమస్యలు వచ్చినా సిబ్బంది చేరుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే వీలుంది. మండలంలో ప్రతీ గ్రామానికి పరిమిత సంఖ్యలో ఉండే సిబ్బంది వెళ్ళడం కష్టమే. సిబ్బందితో త్వరగా పనులు చేయించుకోవడానికి రైతులు భారీగా ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తే వీలుందని పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఎలా అనే దానిపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు.
ఆర్థిక పరిస్థితీ అయోమయం
గత ఏడాది డిసెంబర్ 18 నాటికి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న మొండి బకాయిలు రూ. 48,398 కోట్లు. ఈ మొత్తంలో రూ. 25,950 కోట్లు మూడో డిస్కమ్కు బదిలీ చేస్తున్నారు. అంటే డిస్కమ్ అప్పులతో పుడుతుంది. రైతు విద్యుత్ ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్క స్మార్ట్ మీటరుకు రూ. 25 వేలు వెచ్చించాలి. మొత్తంగా రూ.1,306 కోట్లు ఖర్చు పెట్టాలి. మూడవ డిస్కమ్కు 35,218 (42%) మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందని అంచనా వేశారు.
ఈ డిస్కం నుంచి ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశం లేదు. వ్యయం మాత్రం పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,95,58,748 కనెక్షన్లు ఉండగా అందులో 1,05,58,748 కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నారు. సుమారు రు.4000 కోట్ల వరకు సబ్సిడీ వస్తుంది. ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో రూ.14,000 కోట్లు లోటు చూపుతున్నారు. మూడో డిస్కమ్ను ఆర్థికంగా గట్టెక్కించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఈఆర్సీ కోరుతోంది. దీంతో పాటు పలు సందేహాలను కూడా నివృత్తి చేయాలని కోరింది.


