
గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలతో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ,
ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ సామాజిక వర్గ నేతకు కేబినెట్ విస్తరణలో చోటు
తాజా విస్తరణతో ఎనిమిదికి చేరనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల సంఖ్య
కేబినెట్లో సగానికి పైగా బడుగు, బలహీనవర్గాల నేతలు
సీఎం రేవంత్తో కలిసి నలుగురు రెడ్డి మంత్రులు. వెలమ, బ్రాహ్మణ, కమ్మ వర్గాల నుంచి ఒక్కొక్కరు
మలి విస్తరణలోనూ బీసీ, ఎస్టీలకు అవకాశం... చీఫ్ విప్ పదవి రెడ్డి సామాజికవర్గానికే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక న్యాయానికే పెద్దపీట వేసింది. ఇప్పటికే ఉన్న కేబినెట్ కూర్పును బేరీజు వేసుకొని మరీ సామాజిక న్యాయం కల్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా మంత్రులను ఎంపిక చేసింది. ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ నాయకుడికి మాత్రమే విస్తరణలో అవకాశం కల్పించింది. విస్తరణకు ముందు రాష్ట్ర కేబినెట్లో ఉన్న 12 మంది మంత్రుల్లో (ముఖ్యమంత్రితో సహా) నలుగురు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏడుగురు అగ్రవర్ణాలకు చెందిన మంత్రులున్నారు.
వీరితోపాటు ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు బీసీ, ఎస్సీ నేతలకు కేబినెట్లో అవకాశం కల్పించింది. దీంతో ప్రస్తుతం కేబినెట్లోని 15 మంది సభ్యు ల్లో అగ్రవర్ణాల కంటే అధికంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు స్థానం కల్పించినట్టయ్యింది. ఓసీ నేతలను ఏడుగురికి మాత్రమే పరిమితం చేసింది. కేబినెట్లో ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ద్వారా సగానికిపైగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలుండేలా జాగ్రత్త తీసుకుందని స్పష్టమవుతోంది.

గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిట శ్రీహరి, సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వివేక్ వెంకటస్వామి
ఇందుకోసం రెడ్డి సామాజిక వర్గాల నేతల్లో మంత్రి పదవులు చేపట్టేందుకు అర్హులైన సుదర్శన్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, వెలమ వర్గానికి చెందిన ప్రేమ్సాగర్రావు లాంటి నేతలను కూడా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్, ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం భట్టిల విజ్ఞప్తులు, మంత్రి పదవి ఇస్తామని అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికలకు ముందు రాజగోపాల్రెడ్డికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం గమనార్హం.

కీలక పదవులూ వారికే
మంత్రివర్గం సంగతి అటుంచితే.. అసెంబ్లీలో మిగిలిన పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ప్రాధాన్యం లభించింది. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ (ఎస్సీ) ఉండగా ఎస్టీ (లంబాడా) వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ (ఎస్సీ)కి మంత్రివర్గంలో అవకాశం కల్పించగా, మిగిలిన ఇద్దరు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యలు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానంలో ఖాళీ అయిన విప్తోపాటు చీఫ్ విప్ పదవులు మాత్రమే అగ్రవర్ణాలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లేదంటే అడ్లూరి లక్ష్మణ్ స్థానాన్ని మరోమారు ఎస్సీ నేతతో భర్తీ చేస్తే..ఒక్క చీఫ్ విప్ మాత్రమే రెడ్డి సామాజికవర్గానికి వస్తుంది. ఈ పదవిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డిలలో ఒకరిని వరించే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల అనంతరం మరోమారు కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆదివారం జరిగిన విస్తరణ అనంతరం కేబినెట్లో నియమించుకునేందుకు వీలున్న మూడు స్థానాలను అప్పుడు భర్తీ చేయొచ్చు.
అప్పుడు కూడా కేవలం ఒక్కటి మాత్రమే అగ్రవర్ణాలకు వస్తుందని, ఒకటి బీసీ, మరోటి ఎస్టీ లేదా మైనార్టీ సామాజికవర్గాలకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద తాజా విస్తరణ తరహాలోనే భవిష్యత్లో జరిగే విస్తరణలోనూ అగ్రవర్ణాలతో పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్రవర్ణాలకు ఇతర పదవులు కేటాయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు అర్థమవుతోంది.