అంగన్‌వాడీ సెంటర్లకు గ్రేడింగ్‌ | Telangana: 313 Anganwadi Centers Where Closed Says Minister Seethakka | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ సెంటర్లకు గ్రేడింగ్‌

Apr 11 2025 6:08 AM | Updated on Apr 11 2025 6:08 AM

Telangana: 313 Anganwadi Centers Where Closed Says Minister Seethakka

పనితీరు ఆధారంగా అవార్డులు..

ప్రతి సెంటర్‌లో కనీసం 20 మంది చిన్నారులు ఉండాల్సిందే: మంత్రి సీతక్క

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. మంచి గ్రేడింగ్‌ ఉన్న వాటికే అవార్డులు వస్తాయన్నారు. ప్రతీ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయాలని స్పష్టంచేశారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీతక్క మాట్లాడారు. చిన్నారులు లేరనే సాకుతో 313 సెంటర్లు తెరుచుకోకపోవడం సరికాదని, అలాంటి కేంద్రాలను డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు తరలించాలని చెప్పా రు. 

అంగన్‌వాడీ కేంద్రాలకు అందే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ప్రతీ సెంటర్‌ లో కనీసం 20 మంది చిన్నారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, బడిబాట తరహా లోనే గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. 30 కేంద్రాల్లో పిల్లలే లేరని, 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉందని, 586 కేంద్రాల్లో పదిలోపే పిల్లలున్నారని చెప్పారు.

అధికారులు సరిగా పనిచేయట్లేదు..: చిన్నారుల సంక్షేమంపై రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్ప టికీ అధికారులు సీరియస్‌గా పనిచేయడం లేదని సీతక్క చెప్పా రు. జిల్లా సంక్షేమాధికారులు వారా నికి కనీసం మూడు కేంద్రాలను సందర్శించాల న్నారు. కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ–టెండర్‌ విధానాన్ని పాటించా లన్న ఆదేశాలను ఎందుకు విస్మరించారన్నారు. అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫ రాను నామినేషన్‌ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టారో సంజాయిషీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా టెండర్లు పిలవాలన్నారు.  హైదరాబాద్‌ జిల్లాలో కోడిగుడ్లను సరిగా సరఫరా చేయని ఓ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌ చేశామన్నారు. తప్పు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సంచాలకులు కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement