నీ కాల్మొక్తా సార్‌.. నా కొడుకు భవిష్యత్‌ కాపాడండి | Student Not Write Exam Due To Negligence Of School Staff Regarding Exam Fee | Sakshi
Sakshi News home page

నీ కాల్మొక్తా సార్‌.. నా కొడుకు భవిష్యత్‌ కాపాడండి

Apr 6 2023 7:31 AM | Updated on Apr 6 2023 8:15 AM

Student Not Write Exam Due To Negligence Of School Staff Regarding Exam Fee - Sakshi

కారేపల్లి: ‘‘నీ కాల్మొక్తా సార్‌.. నా కొడుకు భవిష్యత్‌ను కాపాడండి.. ఎలాగైనా సరే నా కొడుకు పదో  తరగతి పరీక్ష రాసేలా చేయండి సార్‌’’ అంటూ ఓ తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కాళ్లపై పడి రోదించింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు చెందిన గుగులోతు రమేష్‌ – సునీత దంపతుల కుమారుడు తరుణ్‌.. గతేడాది కారేపల్లి హైస్కూల్‌లో పదో తరగతి చదివాడు. అయితే గణితంలో ఫెయిల్‌ అయ్యాడు. 

దీంతో, ఈ ఏడాది పరీక్ష రాసేందుకు హైస్కూల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సులోచనకు పరీక్ష ఫీజు రూ.150తో పాటు ఆలస్యమైనందుకు అదనపు రుసుము రూ.వెయ్యి కూడా చెల్లించాడు. అయితే, ఆమె సెలవులో వెళ్తూ హెచ్‌ఎం పవన్‌కుమార్‌కు ఫీజు ఇచ్చినట్లుగా చెబుతోంది. బోర్డుకు మాత్రం ఫీజు అందకపోవడంతో తరుణ్‌కు హాల్‌టికెట్‌ రాలేదు. ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్లో అడగ్గా.. ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతూ చివరకు తాము బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఒప్పుకున్నారు. ఏం చేయాలో తెలియని తరుణ్‌ తల్లిదండ్రులు బుధవారం కారేపల్లి హైస్కూల్‌కు చేరుకుని హెచ్‌ఎం పవన్‌కుమార్‌ కాళ్లపై పడి రోదిస్తూ ఎలాగైనా తమ కుమారుడి భవిష్యత్‌ను కాపాడాలని వేడుకున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement