సాక్షి, హైదరాబాద్: మీడియా అక్రెడిటేషన్ రూల్స్–2025కు పలు కీలక సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో 103 ద్వారా సవరణలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సవరణల ప్రకారం డెస్క్ జర్నలిస్టుల నియామకాల్లో కనీసం 33 శాతం మహిళలకు తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పించనున్నారు.
అలాగే అక్రెడిటేషన్ కోటాలో మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్, కల్చర్, ఫిల్మ్స్ విభాగాల్లో కూడా అదనపు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీలో ప్రెస్క్లబ్ హైదరాబాద్ ప్రతినిధి, బిగ్ డైలీ న్యూస్ పేపర్కు చెందిన డెస్క్ జర్నలిస్టు ప్రతినిధిని చేర్చారు.
అక్రిడిటేషన్ల జీఓ సవరణ అభినందనీయం
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్ల (Media Accreditation) జీఓ 252 సవరించి 103 విడుదల చేయడం అభినందనీయమని డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సహాయ కార్యదర్శి విజయ, ఉపాధ్యక్షుడు నిసార్, జ్యోతిబసు, శేఖర్లతో కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. డెస్క్ జర్నలిస్టుల సమస్యలపై డీజేటీఎఫ్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
అక్రిడిటేషన్ కమిటీలో ప్రెస్క్లబ్ పాలకమండలి
బంజారాహిల్స్: హైదరాబాద్ ప్రెస్క్లబ్ పాలకమండలికి తెలంగాణ రాష్ట్ర మీడియా కమిటీలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ప్రెస్క్లబ్ పాలకమండలి కోరిన వెంటనే రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్లో అవకాశం కల్పించడం పట్ల ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.విజయకుమార్రెడ్డి, రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు రాజేశ్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, బాపురావు వర్ధెల్లి, కోశాధికారి రమేష్ వైట్ల సహా కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపింది.
అంతేకాకుండా మహిళా జర్నలిస్టులకు 33 శాతం అక్రిడేషన్లు ఇవ్వాలన్న అభ్యర్థనకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.


