అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి | Sakshi
Sakshi News home page

అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి

Published Mon, Jan 24 2022 1:13 AM

Special Meeting With Ministers Chinna Jeeyar On Arrangements For Sri Ramanuja Millennium Celebrations In Next Month - Sakshi

శంషాబాద్‌ రూరల్‌: మండలంలోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై మంత్రులు టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం చినజీయర్‌ స్వామితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీరామనగరంలోని నేత్ర విద్యాలయం సమావేశం మందిరంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాలకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెంది న ప్రముఖులు రానుండటంతో ఆ మేరకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్య, వాటర్‌ గ్రిడ్, ఇంట్రా, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, ఏపీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్, రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నేతాజీ జయంతి సందర్భంగా ‘ఉద్ఘోష్‌’  
సాక్షి, హైదరాబాద్‌: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జన్‌ ఉర్జా మంచ్‌ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్‌‘కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఆబ్కారీ శాఖమంత్రి శ్రీనివాస్‌ గౌడ్, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ఉద్ఘోష్‌ అవార్డులను పంపిణీ చేశారు.  

Advertisement
Advertisement