
సాక్షి, నల్లగొండ జిల్లా: శాలి గౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీ వాగులో మృతదేహం బయటపడింది. మేడిపల్లికి చెందిన మహేశ్వరి (26)గా పోలీసులు గుర్తించారు. మహేశ్వరీని హత్య చేసింది సవతి తల్లిగా పోలీసులు తేల్చారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చి మూసీ వాగులో సవతి తల్లే యువతిని పాతిపెట్టింది. మృతిచెందిన యువతి సొంత గ్రామం జనగామ జిల్లా దేవర ఉప్పల మండలం పడమటి తండా గ్రామంగా పోలీసులు గుర్తించారు.
మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్లోని లక్ష్మీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న జాటోత్ మహేశ్వరి (26) అనే యువతి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన అదృశ్యమైంది. ఈ నెల 2న తండ్రి జాటోత్ పీనా మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సవతి తల్లి లలిత పన్నాగంతో మహేశ్వరిని హత్య చేసినట్లు తేలింది. తనకు దక్కాల్సిన ఆస్తిని పెళ్లి పేరుతో మహేశ్వరి తీసుకుపోతుందనే కారణంతోనే లలిత ఈ హత్య చేసినట్లు సమాచారం.
లలిత మేనమామ రవితో పాటు మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని లలిత అంతమొందించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సవితి తల్లి లలిత, మేనమామ రవి, మరో వ్యక్తి సహాయంతో మహేశ్వరిని హత్య చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. నిందితులు చెప్పిన సమాచారంతో వంగమర్తిలో మహేశ్వరి మృతదేహాన్ని వెలికితీశారు.