హైదరాబాద్: భర్తతో తలెత్తిన విభేదాలను ఓ టీవీ చానల్ వేదికగా జరిగే చర్చా కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవడానికి హైదరాబాద్ వచి్చన ఓ మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్లోని ఓ తండాకు చెందిన ఓ మహిళకు 9 ఏళ్ల క్రితం సిరిసిల్లకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో మూడు రోజుల క్రితం ఆ మహిళ పుట్టింటికి వచ్చింది.
ఓ టీవీ చానల్లో కుటుంబ వివాదాల పరిష్కారంపై ప్రసారమయ్యే చర్చా కార్యక్రమానికి వెళ్తే తన సమస్య పరిష్కారమవుతుందని భావించిన ఆమె ఈ నెల 6న మహబూబాబాద్లో రైలెక్కి నగరానికి చేరుకుంది. ఆ చానల్ కార్యాలయం కోసం వెతుకుతూ మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చింది. అదే సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఎక్కడికెళ్లాలని అడగ్గా టీవీ చానల్ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పింది.
తనకు తెలిసిన వ్యక్తికి టీవీ చానల్తో సంబంధాలు ఉన్నాయని.. తనతో వస్తే తీసుకెళ్తానని నమ్మించి ఆ మహిళను ఎంజీ రోడ్డు లోని ఓ నిర్మానుష్య భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన స్నేహితుడిని పిలిపించడంతో అతను కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


