సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట  | SC Stays Telangana HC Order On Contempt Of Court | Sakshi
Sakshi News home page

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట 

Dec 17 2020 7:56 AM | Updated on Dec 17 2020 8:14 AM

SC Stays Telangana HC Order On Contempt Of Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులు సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఎన్‌కే కౌల్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా కట్టడికి అవసరమైన అన్ని పరీక్షలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. రోజుకు 50 వేల పరీక్షలు చేయడం కష్టమని వివరించారు.

అనంతరం 2020 నవంబర్‌ 19న హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, హైకోర్టు సుమోటో ధిక్కార చర్యలకు సంబంధించి మాత్రమే ఫిర్యాదు ఉందని కౌల్‌ వివరించారు. ప్రతివాదులు ఆరు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సుమోటో ధిక్కార చర్యల కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నామని పేర్కొంది. రోజుకు 50 వేలు, వారానికోసారి లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న ఆదేశాలు పాటించడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  

21న కలెక్టరేట్ల వద్ద ప్రభుత్వోద్యోగుల ధర్నా 
సాక్షి, హైదరాబాద్‌: పీఆర్సీ అమలు, బకాయి ఉన్న రెండు డీఏలను విడుదల చేయాలనే డిమాండ్‌పై ఈనెల 21వ తేదీన ఆందోళనలు చేపడతామని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కుమారస్వామి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement