కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం తాహెర్కొండాపూర్ గ్రామ సర్పంచు ఆకుల గిరితో పంచాయతీ కార్యదర్శి బత్తుల ప్రవళికకు ఏర్పడిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరువురి నడుమ నెలకొన్న ఆధిపత్య పోరుతో పరిపాలన గాడితప్పింది. అభివృద్ధి పనులకు అవసరమైన తీర్మానా లు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ నిధుల మంజూరు నిలిచిపోయింది. కార్యదర్శి, సర్పంచ్ ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆధిపత్య పోరుతో గాడితప్పిన పాలన
సర్పంచు, కార్యదర్శి మధ్య ఆధిపత్య పోరుతో పంచాయతీ పాలన గాడితప్పింది. కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించడంలేదని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని, బదిలీ చేయాలని సర్పంచు గిరి కలెక్టర్, డీపీవోకు వినతిపత్రం అందించారు. అయితే సర్పంచు వేధింపులతో తాను సక్రమంగా పనిచేయలేకపోతున్నానని, బదిలీ చేయాలని కార్యదర్శి సైతం డీపీవో, ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు.
ఎలాంటి సమాచారం లేకుండా కార్యదర్శి మూడురోజులు విధులకు గైర్హాజరయ్యారని సర్పంచు ఆరోపించగా, సర్పంచు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స కోసం సెలవు పెట్టానని కార్యదర్శి సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన సర్పంచు, కార్యదర్శి ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
చివరకు చెర్లభూత్కూర్ సర్పంచు కూర నరేశ్రెడ్డి ఇద్దరికీ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గ్రామాభివృద్ధికోసం సమన్వయంతో పనిచేయాల్సిన సర్పంచు, కార్యదర్శులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం తగదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కొన్నిరోజులుగా ఇరువురి నడుమ నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి వివాదాన్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.


