లిస్ట్‌లో పేరొచ్చినా.. పోస్ట్‌ రాలే 

Sangareddy: TSSPDCL JLM Merit Student Did Not Get Post - Sakshi

సాక్షి, సంగారెడ్డి టౌన్‌: గతేడాది జూలైలో ఐటీఐ ట్రేడ్‌ పరీక్ష రాసిన విద్యార్థులు అదే ఏడాది అక్టోబర్‌లో వచ్చిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జేఎల్‌ఎం పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూలైలో పాసైనట్లు సర్టిఫికెట్లు కలిగి ఉండటంతో ఆన్‌లైన్‌‌లో పేర్కొన్న అన్ని విషయాలను చదివి దరఖాస్తును పూర్తి చేశారు. డిసెంబర్‌ 15, 2019లో పరీక్ష రాశారు. ఫలితాలు రాగానే ర్యాంకుల ఆధారంగా కరెంట్‌ పోల్‌ పరీక్షలోనూ నెగ్గారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇలా మెరిట్‌ సాధించి మంచి ర్యాంకులు కలిసిన అభ్యర్థులు తమ ట్రేడ్‌ సర్టిఫికెట్‌లో డేట్‌ అని ఉన్నచోట నవంబర్‌ 6 అని ముద్రించడంతో అధికారులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో మీ మెమోలు నోటిఫికేషన్‌ తేదీ తర్వాత ఇష్యూ అయ్యాయంటూ సదరు అభ్యర్థులను ఉద్యోగానికి అనర్హులుగా తేల్చేశారు. చదవండి: ఓఆర్‌ఆర్‌.. ఫుల్‌ జిగేల్‌! 

ఇతర పరీక్షలకు భిన్నంగా.. 
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ.. వారు పేర్కొన్న అర్హత కోర్సు నోటిఫికేషన్ వచ్చే నాటికి  పాసైతే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ అధికారులు మాత్రం పరీక్షలో పాసైన నెలను వదిలిపెట్టి.. మెమో తయారు చేసిన తేదీని పరిగణలోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూలైలో ట్రేడ్‌ కోర్సు పూర్తి చేసుకున్నట్లు సదరు ప్రభుత్వ సంస్థ గుర్తింపు ఇవ్వగా ధ్రువపత్రం తయారీ తేదీని మాత్రమే ఎలా పరిగణలోకి తీసుకుంటామని మండిపడుతున్నారు. 

న్యాయ పోరాటం చేస్తాం 
విద్యుత్‌ శాఖపై మమకాలంతో ఐటీఐ ట్రేడ్‌ కోర్సు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ గుర్తింపుతో 2019 జూలైలోనే పాసైన అభ్యర్థులు జేఎల్‌ఎం పరీక్షలో మెరిట్‌ ర్యాంక్‌లు సాధించినా ఉద్యోగాలివ్వకపోవడం దారుణం. పాసైనా నెల సరి్టఫికెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నా.. మెమో తయారైన తేదీని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేవరకు న్యాయపోరాటం చేస్తాం. అభ్యర్థులకు మా పూర్తి మద్దతు అందిస్తున్నాం
– ప్రభాకర్‌ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఐఎన్‌టీయూసీ 327 యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు 

షాక్‌ అయ్యాను.. 
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ గతేడాది అక్టోబర్‌ నెలలో ఇచ్చిన నోటిఫికేషన్‌ దరఖాస్తు చేసుకునే నాటికే మేము ఐటీఐ ట్రేడ్‌ పరీక్ష పాసయ్యాం. సంగారెడ్డి నుంచి నా జిల్లా ర్యాంక్‌ 468. ఇక్కడ 1000 ర్యాంకు వరకు ఉద్యోగాలొచ్చాయి. కేవలం మెమోపై తేదీ నవంబర్‌ 6 అని ఉండటం వల్లే ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందరిలాగే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయింది. ఉద్యోగం వస్తుందనుకున్నా.. ఫైనల్‌ రిజల్ట్‌లో నా పేరు, హాల్‌ టికెట్‌ నెంబర్‌ లేకపోవడం చూసి షాకయ్యా..  
– సురేష్‌ నాయక్, సంగారెడ్డి 

ఉమ్మడి జిల్లాలో మెరిట్‌ ర్యాంక్‌ వచ్చి పోస్ట్‌ కోల్పోయిన అభ్యర్థుల వివరాలు

జిల్లా అభ్యర్థుల సంఖ్య
సిద్దిపేట  12 
సంగారెడ్డి 08 
మెదక్‌  05
మొత్తం  25

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top