సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కేపీహెచ్బీకి క్రేజ్ ఎలా ఉందో మరోసారి రుజువైంది. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. రికార్డు స్థాయి ధరలకు భూములు అమ్ముడయ్యాయి. ఇక్కడ చదరపు గజం భూమి గరిష్టంగా రూ.2.70 లక్షల పలికింది.
కెపిహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించింది. ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అధికారుల అంచనాలను మించుతూ వేలంలో కొనుగోలుదారులు పోటీపడి పాట పాడారు.
వేలంలో గజానికి కనీస మద్దతు ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా, గరిష్ఠంగా రూ.2.70 లక్షల వరకు ధర వెళ్లింది. మరో ప్లాట్ గజం రూ.2.36 లక్షలకు విక్రయమవ్వగా, రెండు ప్లాట్లు గజానికి రూ.2.06 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి.వేలం ముగిసే సమయానికి గజం సగటు ధర రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ 16 ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల మేర భారీ ఆదాయం సమకూరింది.
వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు తెలిపింది. కేపీహెచ్బీ ప్రాంతంలోని ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి ఇప్పటికీ నిరంతర భారీ డిమాండ్ ఉందనడానికి ఈ వేలం ఫలితాలే నిదర్శనమని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం పేర్కొన్నారు.
👉ఇదీ చదవండి : టెకీల దెబ్బ.. పడిపోయిన రియల్ ఎస్టేట్!


