
హైదరాబాద్: తెలంగాణను వరుణుడు ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు. రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో అధికారులు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని ప్రాంతాలలోని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వేలాడే విద్యుత్ తదితర వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.