
కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ప్రచారంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణపై దృష్టిసారించనున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆయన టీ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు.
తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చి చెప్పండని ఆయన కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. పొత్తు ఉందని ప్రచారం చేస్తూ బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని, ఆ ప్రయత్నానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన వాళ్లకు చెప్పారు. అలాగే.. కులగణనపై పీసీసీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని ఆయన నేతలకు సూచించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. మే 15 తర్వాత తెలంగాణకు వస్తానని, ఇక్కడ ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆయన టీ కాంగ్ నేతలకు తెలియజేశారు. రేవంత్రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో పాటు బీఆర్ఎస్తో పొత్తుపై కాంగ్రెస్ నేతలు తలో ప్రచారం చేస్తుండడంతో కొందరు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే.