డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ 

Process of degree admissions has begun - Sakshi

నోటిఫికేషన్‌ ఇచ్చిన ఉన్నత విద్యా మండలి 

కొత్తగా అందుబాటులోకి ‘దోస్త్‌’యాప్‌ 

ఈ నెల 16 నుంచే రిజిస్ట్రేషన్లు.. 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు 

జూన్‌ 16న తొలిదశ సీట్ల కేటాయింపు 

మొత్తంగా మూడు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ 

తొలిదశకు రూ.200, తర్వాతి దశలకు రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి గురువారం విడుదల చేశారు.

ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా  ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

మొబైల్‌ ద్వారా కూడా దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ 
► ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి  ఈౖ ఖీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసేప్పుడు విద్యార్థి ఆధార్‌ నంబర్‌తో లింక్‌ అయి ఉన్న మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 

► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

► టీయాప్‌ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్‌ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్‌ ఐడీ సమాచారం వస్తుంది. 

► రిజిస్ట్రేషన్‌ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. 

► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్‌ చేయాలి. 

86 వేల సీట్లు తగ్గాయ్‌.. 
ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. డిమాండ్‌ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్‌ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top