మే 7 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
మూడు విడతలుగా ప్రవేశాలు
దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన మండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్విసెస్–తెలంగాణ (దోస్త్–2026) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సోమవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 969 కాలేజీలు దోస్త్ పరిధిలోకి వస్తాయి.
వీటిల్లో 4,40,107 సీట్లున్నాయి. గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల డిగ్రీలో అడ్మిషన్లు పెరుగుతాయని బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొ.ఎస్కే మహమూద్, ప్రొ.ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.

దోస్త్ మూడు దఫాలుగా..: ఈ ఏడాది కూడా డిగ్రీ కోర్సుల్లో సీట్లను మూడు విడతల్లో భర్తీ చేస్తారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెల 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30న కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ను నిర్వహిస్తారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి.


