మావోయిస్టుల బంద్‌తో అప్రమత్తం  | Police Inspection At Interstate Borders Because Of Maoist Bandh | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల బంద్‌తో అప్రమత్తం 

Sep 29 2020 5:51 AM | Updated on Sep 29 2020 5:51 AM

Police Inspection At Interstate Borders Because Of Maoist Bandh - Sakshi

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు 

సాక్షి, మంచిర్యాల: బూటకపు ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానిత ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజులుగా దళ సభ్యులు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్న అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరంలో డ్రోన్‌ కెమెరాలతో నిఘా వేశారు.

మరోవైపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ.. ప్రతీకార చర్యలు తప్పవని కుమురంభీం మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్‌ పేరుతో ప్రకటన విడుదల కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 19న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు పలుమార్లు దళ సభ్యులు పోలీసులకు ఎదురుపడ్డారు. ఆ సమయంలో మావోయిస్టులు వదిలిపెట్టిపోయిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి 
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్‌ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఇర్నార్‌–పెదపాల్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోలు కాల్పులు   జరపగా.. సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement