వివాహమైన 18 రోజులకే విషాదం
సంగారెడ్డి జిల్లాలో ఘటన
పటాన్చెరు టౌన్: పెళ్లయిన 18 రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, కోట్పల్లి మండలం బీరోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (28)కు పటాన్చెరుకు చెందిన రేణుకతో మే 13న వివాహం జరిగింది. కాగా ఐదు రోజుల క్రితం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీకాంత్ సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డ్ విషయంలో భార్య రేణుక ఇష్టం వచ్చినట్టు అతడ్ని తిట్టింది. దీంతో శ్రీకాంత్ అతని సోదరుడు శ్రీశైలానికి జరిగిన విషయం చెప్పడంతో ఉదయం మాట్లాడుదామని చెప్పాడు. భార్యతో గొడవపడిన శ్రీకాంత్ వేరే రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


