రేషన్‌ కార్డులేక.. బియ్యం అందక.. | New Ration Card Problems In Telangana | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డులేక.. బియ్యం అందక..

Apr 22 2025 11:18 AM | Updated on Apr 22 2025 11:18 AM

New Ration Card Problems In Telangana

పాతకార్డుల్లోనూ పేర్లు తొలగింపు

మార్పులు, చేర్పుల అర్జీలు పెండింగ్‌లోనే.. 

నిరీక్షణలో 69,473 మంది దరఖాస్తుదారులు

నల్లగొండ: కొత్త రేషన్‌కార్డులతోపాటు పిల్లల పేర్లు చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ కార్డులు మంజూరు కాలేదు. దీంతో ఆయా దరఖాస్తుదారులందరికీ ఇప్పట్లో సన్న బియ్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే  కొత్తగా పెళ్లైన వారు రేషన్‌ కార్డు కోసం అర్జీపెట్టుకోగా పాత కార్డులో వారి పేర్లు తొలించారు. దీంతో జిల్లాలో 69 వేల మందికిపైగా ఇటు పాత కార్డుపై బియ్యం అందక, కొత్త కార్డు రాక రేషన్‌ బియ్యానికి దూరం అవుతున్నారు.

దరఖాస్తులు స్వీకరించి.. 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2022లో కొంత మందికి ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు అందించింది. ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో జనం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో కొత్తగా పెళ్లైన వారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో వారిపేర్లు పాత కార్డుల్లో తొలగించారు. ఎన్నికల తరువాత కార్డులు ఇస్తారని భావించారు కానీ ప్రభుత్వం మారవడంతో సాధ్యం కాలేదు. 

కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అర్హులైన వారికి రేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది రేషన్‌ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. మరలా బీసీ కులగణన సమయంలో 27,523 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన జిల్లా అధికారులు దాదాపు 69,473 దరఖాస్తులను అప్రూవల్‌ చేసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు పంపించారు. వీటిని ప్రభుత్వం ఇంకా ఓకే చేయలేదు. దీంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు.  

కొత్త రేషన్‌కార్డు రాలేదు 
నాకు పెళ్లి కాక ముందు అమ్మ నాన్నల రేషన్‌ కార్డులో నా పేరుంది. పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారు. ఆ కార్డులో వారి పేర్లు లేవు. ఆరు నెలల క్రితం కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకున్నా. కొత్తకార్డు రాలేదు. నాకు సన్న బియ్యం అందడం లేదు.  
– చంద్రశేఖర్, బొట్టుగూడ, నల్లగొండ

రేషన్‌ బియ్యం రావడం లేదు
రేషన్‌ కార్డులో నా కుమారుడి పేరు ఎక్కించేందుకు చాలా రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్న. ఇంతవరకు పేరు ఎక్కలేదు. పలుమార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మా బాబుకు బియ్యం రావడం లేదు. 
– సంగెపు నవీన్, శాబ్దుల్లాపురం, కనగల్‌ మండలం

ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే.. 
కొత్త రేషన్‌కార్డులకు చేసుకున్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హుల జాబితాను పౌరసరఫరాల శాఖకు పంపించాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశానుసారం సన్న బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం. 
– హరీష్, సివిల్‌ సప్లయ్‌ డీఎం, నల్లగొండ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement