సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కొన్ని కులాల పేర్లు ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కులాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బీసీ కులాల్లో గ్రూప్–ఏ లోని వరుస సంఖ్య 4లో ఉన్న బుడబుక్కల కులాన్ని శివ క్షత్రియగా మార్పు చేశారు. ఇదే కేటగిరీలోని వన్నార్ను తొలగించి ధోబీగా మార్పు చేసి రజక, చాకలి, ధోబీగా.. ఏదైనా ఒక పేరును వాడుకలోకి తీసుకోవచ్చన్నారు. వరుస సంఖ్య 7లోని దొమ్మర అనే పదాన్ని తొలగించి గడ వంశీయగా మార్పు చేశారు.
వరుస సంఖ్య 18లో ఉన్న పిచ్చకుంట్ల పేరును వంశరాజ్గా మార్పు చేశారు. వరుస సంఖ్య 23లో ఉన్న వీరభద్రియను వీరముష్టి, నెట్టి కోటల, వీరభద్రియగా మార్చారు. గ్రూప్ డీ, వరుస సంఖ్య 5లో ఉన్న మేర కులం పేరును మేరుగా మార్పు చేశారు. వరుస సంఖ్య 29లో ఉన్న శూద్ర కులం పేరును తొలగించి తమ్మలిగా మార్చారు.


