తక్కువ వడ్డీకే రుణాలివ్వండి.. నాబార్డు ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌ భేటీ | Nabard Chairman Shaji Kv Meets Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

తక్కువ వడ్డీకే రుణాలివ్వండి.. నాబార్డు ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

Mar 21 2025 4:39 PM | Updated on Mar 21 2025 4:47 PM

Nabard Chairman Shaji Kv Meets Cm Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో నాబార్డ్‌ చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్‌ఐడీఎఫ్‌ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్‌ను సీఎం కోరారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో నాబార్డ్‌ చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్‌ఐడీఎఫ్‌ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్‌ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరిన సీఎం.. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్‌లు నిధులు మార్చి 31లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం అన్నారు.

స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు ఛైర్మన్‌ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement