ప్రభుత్వం కన్నా పార్టీనే ప్రధానం | Meenakshi Natarajan in a meeting with TPCC district observers: Telangana | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం కన్నా పార్టీనే ప్రధానం

Jun 24 2025 3:07 AM | Updated on Jun 24 2025 3:07 AM

Meenakshi Natarajan in a meeting with TPCC district observers: Telangana

గుజరాత్‌ మోడల్‌ను తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి 

పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలం 

సంస్థాగత నిర్మాణం చాలా కీలకం... 30వ తేదీలోపు కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి 

జిల్లా పరిశీలకులతో భేటీలో మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటం కంటే పార్టీ బలంగా ఉండటమే ప్రధానమని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఉద్ఘాటించారు. పార్టీ బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలమని, సంస్థాగత నిర్మాణం చాలా కీలకమన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం గాందీభవన్‌లో క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు కోసం జిల్లాల వారీగా నియమించిన పరిశీలకులతో వారు విడివిడిగా భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ కూడా పాల్గొన్నారు. కొన్ని కమిటీలు పెండింగ్‌లో ఉండటంతో వాటిని కూడా ఈనెల 30లోపు పూర్తి చేయాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ సూచించారు. ఈ కమిటీలు పూర్తయిన తర్వాత డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రారంభమవుతుందని, ఈ నియామకాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్‌ నుంచి ఏఐసీసీ పరిశీల­కులు వస్తారని చెప్పినట్లు తెలిసింది. పలువురు పరిశీలకు­లు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను వివరించారు. కొన్నిచోట్ల కార్యకర్తల అసంతృప్తిని వారి దృష్టికి తెచ్చారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలున్నాయని, కొన్నిచోట్ల ఆధిపత్య పోరు, సమన్వయ లోపం ఉన్న అంశాన్ని వివరించారు.   

అన్యాయం చేయం 
గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పీసీసీ నియమించిన పరిశీలకులదేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో 80 శాతం పాత కాంగ్రెస్‌ వారికే ఇచ్చామని, 30 ఏళ్లుగా పార్టీ­లో ఉన్న వారికి కూడా ప్రాధాన్యతనిచ్చామన్నారు. 2017 కంటే ముందు పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలనే ప్రాతిపదికను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, కొన్ని సమీకరణలు, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి వచి్చన వారికి ఇచ్చామని చెప్పారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే కొంత రాజీపడక తప్పదని వివరించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేసే ప్రసక్తే లేదని, అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పదవుల్లో వారికి తప్పకుండా అవకాశమిస్తామన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారం కోసం రోజూ గాం«దీభవన్‌లో పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి, కార్పొరేషన్‌ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల్లో ఎవరో ఒకరు కచి్చతంగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండాలన్నారు. పదేళ్లు ఎక్కడో కూర్చుని ఇప్పుడు గ్రామాలకు వెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తామంటే కుదరదని, ప్రజాదరణ ఉన్నవారికే స్థానిక ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి, మహేశ్‌ గౌడ్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతకుముందు టీపీసీసీ డీలిమిటేషన్‌ కమిటీ సమావేశం సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, పవన్‌ మల్లాది తదితరులు పాల్గొన్నారు.

నేడు గాంధీభవన్‌కు సీఎం రేవంత్‌ 
గాంధీభవన్‌లో మంగళవారం కూడా కీలక సమావేశాలు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. తర్వాత పార్టీ సలహా కమిటీ భేటీ కానుంది. అనంతరం టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించి వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాలకు మీనాక్షి నటరాజన్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారని గాం«దీభవన్‌ వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement