పిల్లలకోసం వేధింపులు

Married Woman commits suicide in Adilabad - Sakshi

ఆదిలాబాద్: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్‌లో చోటు చేసుకుంది. కన్నెపల్లి మండలం జన్కాపూర్‌ గ్రామానికి చెందిన దర్వాజల లచ్చన్న, భాగ్య దంపతుల కుమార్తె శ్రీలత(25)కు తాండూర్‌కు చెందిన పెద్దబోయిన మహేందర్‌తో 2021లో వివాహమైంది. ఆదివారం ఉదయం అత్తగారింటి నుంచి వెళ్లిన శ్రీలత తాండూర్‌ పాత గోదాంల సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై కనిపించింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహానికి సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించారు. కాగా తన కూతుర్ని భర్త మహేందర్, అత్త గౌరక్క, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకురావాలని, పిల్లలు కావడంలేదని మానసికంగా వేధించేవారని ఆరోపించారు. అత్తింటి వారే చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు     తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top