తక్కువ ఖర్చుతో కలుపు తీసే యంత్రం

యంత్రంతో కలుపు మొక్కలను తొలగిస్తున్న శర్వాని  - Sakshi

సాక్షి, మంచిర్యాల‌: రైతులకు లాభం చేకూర్చేవిధంగా తక్కువ ఖర్చుతో కలుపు తీసే యంత్రాన్ని బీఎస్సీ అగ్రికల్చర్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని శర్వాని తయారు చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్న కాసం శర్వాని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల శ్రీ సంతు శంకర్‌ మహారాజ్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కళాశాలలు తెరవక పోవడం, ఆమె ప్రాజెక్టులో భాగంగా, రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చాలని, కళాశాలలో చెప్పిన పాఠ్యాంశాలు, ఆన్‌లైన్‌లో కలుపు యంత్రాలను తయారు చేసే విధానం చూసి, అందుబాటులో ఉన్న వాటితో కేవలం రూ. 500లను ఖర్చు చేసి కలుపు యంత్రాన్ని తయారు చేసింది.

ఒక పెద్ద ఇనుప రాడ్డు, షార్పుగా ఉన్న మేకులు, పాత సైకిల్‌ రీమ్‌లను యంత్రంలా వెల్డింగ్‌తో తయారు చేయించింది. డీజిల్, పెట్రోల్‌ ఉపయోగించకుండానే కలుపును త్వరగా, సులభంగా తీయడం వల్ల, సమయం ఆదా కావడంతో పాటు, రైతులకు కష్టం కలగకుండా ఉండేలా దానిని తయారు చేసింది. ఆమె తయరు చేసిన యంత్రంతో మంచిర్యాలలోని వారి పొలంలోనే కలుపు మొక్కలను విజయవంతంగా తొలగించింది. కలుపు యంత్రం వినియోగం, పూల మొక్కలు, పండ్ల మొక్కలు వృద్ధి కోసం మందార మొక్కల గట్టి చెక్క వినియోగం, కలబంద, కంపోస్టు, కోకోపీట్, ఎర్రమట్టి వినియోగం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top