వివాహేతర సంబంధం, రూ. 2 కోట్ల బీమా కోసం.. | Mancherial Murder Mystery | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం, రూ. 2 కోట్ల బీమా కోసం..

May 28 2026 7:18 AM | Updated on May 28 2026 7:18 AM

Mancherial Murder Mystery

మంచిర్యాల క్రైం: వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడి చేత హత్య చేయించింది. ఇందుకోసం భర్త పేరిట ముందే రూ. 2 కోట్ల విలువైన బీమా పాలసీలు చేయించి వాటిని కూడా సొంతం చేసుకోవాలని పథకం రచించింది. ఆపై ఎవరికీ అనుమానం రా కుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగు చూడటంతో చివరకు కటకటాలపాలైంది. మంచిర్యాలలో డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. 

మృతుడి తల్లి ఫిర్యాదుతో.. 
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గుడిపేట గ్రామంలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి చెందిన సాయిని కుమార్‌ (40) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న రాత్రి పని నిమిత్తం బయటకు వెళ్లిన కుమార్‌.. ముల్కల్ల శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు హాజీపూర్‌ పోలీ సులకు సమాచారం అందించారు. అయితే కుమారుడి మర ణం అనుమానాస్పదంగా ఉండటంతో తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఏడాది క్రితం నుంచే.. 
గుడిపేటకు చెందిన రామ్‌మల్లేశ్‌ వద్ద కుమార్‌ గతంలో రూ. 60 వేలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రామ్‌ మల్లేశ్‌ తన అప్పు తీర్చాలంటూ తరచూ కుమార్‌ ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. చంపుతానని కూడా బెదిరించేవాడు. ఈ క్రమంలో రామ్‌మల్లేశ్‌  భారతికి దగ్గరయ్యాడు. అప్పటికే ఆమె గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో భారతి, కుమార్‌ మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భారతి ఏడాది క్రితమే నిర్ణయించుకుంది. 

లోన్‌ యాప్‌లో అప్పు చేసి బీమా పాలసీలు.. 
భర్తను హత్య చేస్తే వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా పోతుందని.. అదే సమయంలో భర్త పేరిట బీమా చేయిస్తే రూ. కోట్లు పొందొచ్చని భారతి భావించింది. ఇందుకోసం ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల ద్వారా ఏకంగా రూ. 15 లక్షలు అప్పు చేసి గతేడాది జనవరిలో భర్త కుమార్‌ పేరిట వివిధ బీమా కంపెనీల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన పాలసీలు తీసుకుంది. అనంతరం భర్త హత్యకు రూ.10 లక్షలతో రామ్‌ మల్లేశ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని వారిద్దరూ పథకం వేసుకున్నారు. రామ్‌మల్లేశ్‌... తనకు పరిచయం ఉన్న మంచిర్యాల ఎల్‌ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్‌కుమార్‌ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 22న రాత్రి రామ్‌మల్లేశ్, శ్రీరాంకుమార్‌లు కుమార్‌తో కలిసి ముల్కల్ల శివారులో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న కుమార్‌ను ఇనుప సుత్తితో తలపై కొట్టి చంపారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కనే మోటార్‌ సైకిల్‌ పడేసి వెళ్లిపోయారు.

 కుమార్‌ మృతిచెందడం, అతని తల్లి ఈ మరణంపై అ నుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు భార్యపైనే అనుమా నం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య చేసింది రామ్‌మల్లేశ్, శ్రీరాంకుమారేనని.. చేయించింది భారతి అని నిర్ధారించారు. అలాగే భారతితో వివాహేతర సంబంధం కొనసాగించిన లగిశెట్టి సురేందర్‌పైనా కేసు నమోదు చేశారు. స్థానిక ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్‌ సీఐ గోపతి రవీందర్, ఎస్సై కిరణ్‌కుమార్‌ రెండ్రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. మంగళవారం భారతి, రామ్‌మల్లేశ్, సురేందర్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీరాంకుమార్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement