
ఆర్మీ, ఉపాధ్యాయ, పోలీసు, ఎయిర్ఫోర్స్, నేవీలో సేవలు
ఆర్మీలో అత్యధికం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం.. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా విలసిల్లుతోంది. గ్రామం నుంచి ఆర్మీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్ఎస్పీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఏఆర్, పోలీసు విభాగాలతో పాటు ఉపాధ్యాయులు 79 మంది వరకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఎక్కువగా సైనికులు దేశానికి సేవలందిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్ జవాన్గా చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ.. కంబాలపల్లి గ్రామం (Kambalapally Village) ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు.
సేవలందిస్తున్న 79 మందిలో...
కంబాలపల్లి గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) చేస్తున్నారు. ఇందులో 38 మంది ఆర్మీలో, 10 మంది కానిస్టేబుళ్లు, 15 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు టీఎస్ఎస్పీ, ఇద్దరు నేవీ, ముగ్గురు ఎయిర్ ఫోర్సు, ఐదుగురు గన్మన్లు, ఇద్దరు ఎస్పీఎఫ్ (SPF) విభాగాల్లో పనిచేస్తున్నారు.
తొలిసారిగా ఎయిర్ఫోర్స్లో..
కంబాలపల్లి గ్రామం నుంచి ఎంపికైన మొట్టమొదటి ఎయిర్ఫోర్స్ (Air Force) ఉద్యోగిగా నూకల నరేందర్ రెడ్డి పేరుపొందారు. ఎయిర్ఫోర్స్ విమాన కమాండర్ (ఆర్మీలో బ్రిగేడియర్ హోదా)గా 36 ఏళ్లపాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ పైలట్ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ గ్రామం నుంచి దేశ రక్షణ, ఇతర విభాగాల్లో యువకులు పనిచేస్తూ ఆదర్శంగా నిలవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.
– నూకల నరేందర్రెడ్డి, మొట్టమొదటి ఎయిర్ఫోర్స్ ఉద్యోగి
గ్రేడ్ హవల్దార్గా విధులు..
గ్రామానికి చెందిన కొలిశెట్టి సుధాకర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్ హోదాలో కొనసాగుతున్నారు. దేశ సేవ చేయాలనే లక్ష్యంతో 2001లో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత లాంచ్ నాయక్, నాయక్, హవల్దార్ హోదాల అనంతరం ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్గా పనిచేస్తున్నారు.
– కొలిశెట్టి సుధాకర్, ఆర్మీ గ్రేడ్ హవల్దార్
22 ఏళ్లుగా ఆర్మీలో ..
గ్రామానికి చెందిన సంద భాస్కర్ 22 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య ఆర్మీలో చేరిన మొ దటి వ్యక్తి కాగా.. భాస్కర్ రెండోవారు. ఆర్మీలో జూనియర్ కమాండెంట్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు.
– సంద భాస్కర్, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్
తండ్రిని ఆదర్శంగా తీసుకొని..
గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య, సైదమ్మ దంపతుల చిన్న కుమారుడు అవినాశ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆర్మీలో చేరాడు. ఆయన ప్రస్తుతం జమ్మూలో ఆర్టిలరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.
– మల్లికంటి అవినాశ్, ఆర్మీ ఆర్టిలరీ ఉద్యోగి
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా..
గ్రామానికి చెందిన మల్లికంటి రమేశ్ ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ రాసి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు.
– మల్లికంటి రమేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు