నేడు, రేపూ వర్షాలు తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ విస్తరించి సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి పశ్చిమ–మధ్య, తూర్పు–మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా అంతటా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరించాయి.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగానే నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 23.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు శనివారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో కురవడంతో ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు పడ్డారు.


