మీపై కుట్ర అవసరం వైఎస్సార్‌కు లేదు | KVP Ramachandra Rao open letter to AP Deputy CM Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మీపై కుట్ర అవసరం వైఎస్సార్‌కు లేదు

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

KVP Ramachandra Rao open letter to AP Deputy CM Pawan Kalyan

మీ వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరం..మిమ్మల్ని టార్గెట్‌ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ 

ఎందుకంటే అప్పట్లో మీరు గానీ మీ కుటుంబం గానీ రాజకీయాల్లోనే లేరు 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ 

ఆ పోలీస్‌ అధికారి లై డిటెక్టర్‌ పరీక్షకు హాజరై అవే మాటలు చెబితే సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.10 కోట్లు ఇస్తానని సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనపై రాజకీయ కుట్ర చేశారని ఓ పోలీస్‌ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌పై కుట్ర చేయాల్సిన అవసరం వైఎస్సార్‌కు లేదని, వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్‌ కల్యాణ్‌పై లేదా ఆయన కుటుంబ సభ్యులపై రాజకీయ కక్షతో కేసులు పెట్టినట్టుగా ఆధారాలు ఏవీ లేవని పేర్కొన్నారు. 

ఒక ముఖ్యమంత్రి తన రాజకీయ వ్యూహాలను పోలీసు అధికారులతో పంచుకోవడం కూడా వాస్తవ దూరమని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించిన పోలీసు ఉన్నతాధికారి లై డిటెక్టర్‌ పరీక్షకు హాజరై వైఎస్సార్‌ అలాంటి వ్యాఖ్యలు చేశారని చెబితే, తాను, వైఎస్సార్‌ అభిమానులు కలిసి రూ.10 కోట్లను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లేదా పవన్‌ సూచించే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఆరోపణలపై నిజంగా విశ్వాసం ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం పవన్‌ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు.  

మీపై అంత ప్రజాభిమానం అప్పుడూ లేదు..
‘కొంత మంది తెలంగాణ నాయకులు.. మిమ్మల్ని ప్యాకేజీ స్టార్‌ అని పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అని అనడం మీ హృదయాన్ని ఎంతో గాయపరిచిందని అర్థం చేసుకోగలను. అయితే జనం మెచ్చిన నాయకుడు వైఎస్సార్‌పై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు బాధపడతారు. రాజశేఖరరెడ్డి ఉంటే తమకు అన్యాయం జరగదని అనుకున్న వారి అచంచల విశ్వాసమే ఆయన లేనప్పుడు కూడా ఆ అభిమానాన్ని చూపిస్తున్నాయి. ప్రజల విశ్వాసం గెలుచుకున్న గొప్పదనం ఆయనది. 

2005–06 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌కు అపార ప్రజాదరణ ఉండేది. అప్పట్లో రాజకీయాల్లో లేని మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేయాల్సిన అవసరం వైఎస్సార్‌కు లేదు. ఆ సమయంలో మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అప్పటికి మీరు, మీ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్‌ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. 

నిజానికి అంత ప్రజాభిమానం మీపట్ల అప్పుడూ లేదు.. ఆ తర్వాత లేదన్నది సత్యం. మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019లో రెండుచోట్ల స్వయంగా పోటీ చేసి ఓడిపోవడం, 2023లో తెలంగాణ శాసనసభ, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలు. ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం తగని పని..’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement