KTR Visits Chimalapadu Cylinder Blast Victims At NIMS - Sakshi
Sakshi News home page

కారేపల్లి ఘటనలో కుట్ర కోణం.. కేటీఆర్‌ ఏమన్నారంటే!

Apr 13 2023 11:39 AM | Updated on Apr 13 2023 4:26 PM

KTR Visits karepalli Chimalapadu Cylinder Blast Victims At Nims - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా కారేపల్లి అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. కారేపల్లి ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
చదవండి: కాళ్లు తెగి ముక్కలై.. బతుకుల్లో నిప్పు పెట్టిన బాణసంచా

కాగా, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలిన విషయం తెలిసిందే. కారేపల్లి మండలం చీమలపాడులో ఈఘటన చోటుచేసుకుంది. బాణసంచాతో గుడిసెకు నిప్పు అంటుకోవడతో సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి కాళ్లు తెగిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరికొందరికి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement