కన్నెపల్లికి తాము రాకుండా ఆపడానికి ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్ను వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వృథాగా పోతున్న జలాలను పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా సముద్రంలో వెళ్తున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రతో జలదౌత్యం చేశాం. నీళ్లు పల్లమెరుగు అనే నానుడిని తప్పు అని కేసీఆర్ నిరూపించారు. బీఆర్ఎస్ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నీళ్లు తీసుకొచ్చాం. నీళ్లు ఎత్తేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరం కాళేశ్వరం.
ఆంక్షలు, ఆటంకాల నడుమ కన్నెపల్లి వద్దకు చేరుకున్నా. పంప్ హౌస్ వద్దకు రాకుండా మా కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోతుంది. నీళ్లు, నిధులు, నియామకాల మీద తెలంగాణ పోరాటం సాగింది. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సంకల్ప బలంతో నీటి పారుదల కోసం ఒక యజ్ఞంలా శ్రీకారం చుట్టారు.
సముద్రానికి 80, 90 మీటర్ల ఉన్న గోదావరి నీటిని ఒడిసి పట్టి లిఫ్ట్ సాయంతో ఎగువకు పంపిచవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడి హెట్టి నిర్మాణానికి ప్రయత్నం చేయలేదు. తెలంగాణ బీడు భూములకు నీరు అందించాలని ఉద్దేశంతో జలదౌత్యం చేశారు. మూడున్నర సంవత్సర కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. సెంట్రల్ వాటర్ కమీషన్ పెట్టి బెస్ట్ పాయింట్ ని గుర్తించి ప్రాజెక్టు నిర్మించాం. మహారాష్ట్ర వెళ్లి ఒప్పించి వేగంగా నిర్మించారు’’ అని తెలిపారు.


