రాజీనామా చేయమని నాకెవరూ చెప్పలేదు
బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు ఒక న్యాయమా?
ప్రభుత్వ పెద్దల,సీఎం కుటుంబసభ్యుల అవినీతి తెలియదా?
మంత్రి పొంగులేటి కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు నోటీసులు ఇవ్వరు?
మీడియాతో మంత్రి సురేఖ
సాక్షి, న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో మాట్లాడక ముందు మంత్రి సురేఖ వారితో ముచ్చటించారు. సీఎం, ఇతర నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రస్తుతం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నా. రాజీనామా చేయాలని ఇప్పటివరకు నాకెవరూ చెప్పలేదు.
నేను బీసీని కాబట్టి నాకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? కేబినెట్లో ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు? మంత్రి పొంగులేటి కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు నోటీసులు ఇవ్వరు?
సీఎంది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా?
సీఎం రేవంత్రెడ్డి అనేకసార్లు పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయనే నేరుగా ప్రకటిస్తున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంంఘన కాదా? నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నాపై చర్యలు తీసుకోవాలంటే పార్టీ, ప్రభుత్వంలో ఇంకా చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారు? నా కుమార్తె మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దల, సీఎంకుటుంబ సభ్యుల అవినీతి అందరికీ తెలియదా? నాపై బర్తరఫ్ వంటి లాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను..’ అని సురేఖ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను సైతం తొలగించేందుకు కుట్ర జరగుతోందని, మంత్రి పొన్నంను ఆయన శాఖలో స్వేఛ్చగా పని చేయనీయడం లేదని ఆరోపించారు.


