CV Anand- Stephen Raveendra: ఆ ఇద్దరిదీ తమదైన ముద్ర

Key responsibilities for Hyderabad and Cyberabad CPs - Sakshi

హైదరాబాద్, సైబరాబాద్‌ సీపీలకు కీలక బాధ్యతలు 

నార్కొటిక్స్, సైబర్‌ బ్యూరోలకూ వీరి నేతృత్వం  

ఈ అంశాలపై ఇప్పటికే ఇరువురికీ ప్రత్యేక గుర్తింపు 

మూడు కమిషనరేట్లలోనూ పలువురికి స్థానచలనం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో, తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు నేతృత్వం వహించే అరుదైన అవకాశం హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్‌ రవీంద్రలకు దక్కింది. ఆయా అంశాల్లో నిష్ణాతులుగా పేరున్న వీరికి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. నార్కొటిక్స్‌ బ్యూరో హైదరాబాద్‌ కేంద్రంగా, సైబర్‌ బ్యూరో సైబరాబాద్‌ కేంద్రంగా పని చేయనున్నాయి.  

హెచ్‌–న్యూ టు టీఎస్‌ బ్యూరో.. 
►యువతను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలను రాష్ట్రం నుంచి పారదోలాలనే లక్ష్యంగా రాష్టస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ గతేడాది నిర్ణయించారు. అప్పటి నుంచి వివిధ అంశాలపై కసరత్తులు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు గత నెలలో 300 పోస్టులతో ఈ విభాగం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిం​ది. 2021 డిసెంబర్‌ 25న హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు తీసుకున్న ఆనంద్‌ తన తొలి ప్రాధాన్యం డ్రగ్స్‌ నిరోధానికే అని స్పష్టం చేశారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపారు.  
►ఈ కారణంగానే ఫుడింగ్‌ అండ్‌ మింక్‌లో జరిగిన రేవ్‌ పార్టీ భగ్నం, అంతర్జాతీయ డ్రగ్‌ పెడ్లర్‌ టోనీ అరెస్టు తదితర కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటికి కొనసాగింపుగా గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌కు (హెచ్‌–న్యూ) రూపమిచ్చారు. అతి తక్కువ సిబ్బంది, వనరులతో ఈ విభాగం ఇప్పటికే అద్భుత ఫలితాలు సాధించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోను ప్రభుత్వం సీవీ ఆనంద్‌కు అప్పగించింది.  

‘సైబర్‌’లో స్టీఫెన్‌ మార్క్‌..  
ఆన్‌లైన్‌లో అందినకాడికి దోచుకునే సైబర్‌ నేరగాళ్లను పట్టుకోవడం, వారి నుంచి సొత్తు రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలకు కొలిక్కితేవడంతో పాటు వీటిని నిరోధించడానికి పోలీసు విభాగం ప్రాధాన్యమిస్తోంది.

నేరం చోటు చేసుకోవడానికి ముందే నేరగాళ్ల ఉనికిని కనిపెట్టి చెక్‌ చెప్పడంతో పాటు డార్క్‌ వెబ్‌ సహా దేని ద్వారా జరిగిన నేరాన్నైనా ఛేదించడం, ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యాలతో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ‘తెలంగాణ స్టేట్‌ పోలీసు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ’కి రూపమిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సర్కారు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు అప్పగించింది. 

ట్రాఫిక్‌పై మంచి పట్టున్న ‘చీఫ్‌’
తాజా బదిలీల్లో రాచకొండ అదనపు పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న జి.సుధీర్‌ బాబు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌తో పాటు నార్త్, వెస్ట్‌ జోన్లు, ట్రాఫిక్‌ డీసీపీతో పాటు కీలక పోస్టుల్లో పని చేసిన ఆయనకు నగరంపై మంచి పట్టుంది. రాచకొండ సంయుక్త సీపీగా సిటీ సీసీఎస్‌ నుంచి డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ వెళ్లారు. కొన్నాళ్లుగా ఇన్‌చార్జి అదనపు సీపీగా (శాంతిభద్రతలు) ఉన్న విక్రమ్‌ సింగ్‌ మాన్‌ అదే స్థానంలో నియమితులయ్యారు.

ఇన్‌చార్జి సంయుక్త సీపీగా (పరిపాలన) ఉన్న ఎం.రమేష్‌ డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా ఆయన స్థానంలోకి సీఐడీ నుంచి పరిమళ నూతన్‌ వచ్చారు. సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌ నుంచి కార్తికేయ ట్రాన్స్‌ఫర్‌ కాగా అక్కడకు సీఐడీ నుంచి ఎం.శ్రీనివాసులు వస్తున్నారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జేసీపీగా ఎస్పీ ర్యాంక్‌లో ఉన్న కె.నారాయణ నాయక్‌కు పోస్టింగ్‌ వచి్చంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top