
ఉదయం, సాయంత్రం విద్యార్థుల ఇళ్లకు..
చదువులపై తల్లిదండ్రులతో మాటామంతీ..
పాఠశాల నిర్వహణ, బోధనపై ప్రత్యేక శ్రద్ధ
బీబీపేట జెడ్పీ పాఠశాల హెచ్ఎం రవీంద్రారెడ్డి కృషి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బడి ముగిశాక ఏ ఉపాధ్యాయుడైనా ఇంటికి వెళ్తారు.. కానీ ఒక ప్రధానోపాధ్యాయుడు పాఠశాల తనది.. పిల్లలను కుటుంబసభ్యుల్లా భావిస్తున్నారు. పాఠశాలలోనే ఉంటూ.. విద్యార్థుల ఇళ్లకు రోజూ వెళ్తూ.. చదువును పర్యవేక్షిస్తూ.. అనుక్షణం వారి ఉన్నతికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీబీపేట టీఎస్ఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ మూల రవీంద్రారెడ్డి.
2023 సెప్టెంబర్ 25న వరంగల్ జిల్లా (Warangal District) నుంచి బదిలీపై రవీంద్రారెడ్డి వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదే బడిలో నివసిస్తున్నారు. రెండు రోజుల సెలవులు (Holidays) వచ్చినప్పుడే.. సొంతూరు వరంగల్కు వెళ్తారు. స్కూళ్లో మొత్తం 610 మంది విద్యార్థులు ఉన్నారు.
బడిలోనే ఉంటూ..
పాఠశాల నిర్మించిన సమయంలోనే ఉపాధ్యాయుల కోసం పై అంతస్తులో గదులు నిర్మించారు. హెడ్మాస్టర్ (Head Master) రవీంద్రారెడ్డి అందులోనే ఉంటున్నారు. ఆయన రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్తారు. వారేం చదువుతున్నారో పరిశీలించి.. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తారు. పిల్లలు పాఠశాలకు గైర్హాజరైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులను పిలిచి మాట్లాడతారు.
విద్యార్థులను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం
కార్పొరేట్ విద్యాసంస్థలో లేని సౌకర్యాలన్నీ మా పాఠశాలలో ఉన్నాయి. మంచి ఉపాధ్యాయుల బృందం ఉంది. ఆధునిక పద్ధతుల్లో బోధన సాగిస్తున్నాం. పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇంకా మెరుగవ్వాలి. విద్యార్థులను తీర్చిదిద్దడానికి మరింతగా ప్రయత్నిస్తాం.
– మూల రవీంద్రారెడ్డి, హెడ్మాస్టర్, బీబీపేట, కామారెడ్డి జిల్లా
చదవండి: జగిత్యాలకు ఐకాన్ ఈ ఖిల్లా