
జగిత్యాల ఖిల్లా ముఖద్వారం
వందల ఏళ్లయినా ఇప్పటికీ చెక్కు చెదరని కోట
వంద ఫిరంగులకు పైగానే ఏర్పాటు
శత్రువుల దాడి నుంచి తట్టుకునేందుకు లోతైన కందకం
జగిత్యాల: ఈ ఖిల్లా జగిత్యాలకే ఐకాన్. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ కోట చుట్టూ కందకాలను తవ్వారు. శత్రువులు కోటపై దాడిచేస్తే అడ్డుకునేందుకు దాదాపు వందకు పైగా ఫిరంగులు (Cannons) ఏర్పాటు చేశారు. సైనికుల కోసం ప్రత్యేక గదులు, అలాగే ఫిరంగులు, ఆయుధాల నిల్వ కోసం కూడా ప్రత్యేకమైన గదులు, తాగునీటి కోసం నిర్మించిన బావి, కోనేరు సైతం ఇందులో ఉన్నాయి. దాదాపు మూడు వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ కోట ఇంకా చెక్కు చెదరకుండా ఉంది.

1930 వరకు జగిత్యాల (Jagtial) రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవని చెబుతుంటారు. ఎలగందుల కోట పాలకులైన జుల్ముల్క్ జాఫరుద్దౌలా, మీర్జా ఇబ్రహీంఖాన్లు ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. ఫ్రెంచ్ ఇంజనీర్లు దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. దీనిని పైనుంచి చూస్తే తప్ప ఇది నక్షత్రాకారంలో ఉన్నట్లు తెలియదు.
చెక్కుచెదరని గోడలు.. కందకాలు..
వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ఖిల్లా ముఖద్వారం గానీ, సైనికుల కోసం ఏర్పాటు చేసిన గదులు గానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శత్రువులు కోటలోనికి రావాలంటే లోతైన ఆ కందకాన్ని దాటి రావాల్సి ఉంటుంది. అప్పట్లో ఆ కందకంలో మొసళ్లను కూడా పెంచేవారని చెబుతుంటారు.
సైనికులు రాకపోకలు సాగించడానికి కొన్ని చోట్ల కందకాల వద్ద చెక్క తలుపులు ఉండేవి. అవసరం ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేవారు. కోటలో ఏనుగులు (Elephants) కూడా ఉండేవని చెబుతుంటారు. అలాగే ఇప్పటికీ ప్లస్ ఆకారంలో నిర్మించిన కోనేరులో ఎంత ఎండలు మండినా నీరు ఎండిపోదు. ఈ కోట నుంచి ఒక సొరంగం కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఎలగందుల కోటకు సైతం వెళ్తుందని చరిత్రకారులు చెబుతుంటారు.

పట్టించుకోని పురావస్తు శాఖ..
ఈ ఖిల్లాను అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జగిత్యాల జిల్లాగా ఏర్పాటైన అనంతరం అప్పటి కలెక్టర్ శరత్.. జగిత్యాల ఖిల్లాలోనే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఖిల్లాకు పూర్వ వైభవం వచ్చింది.
చదవండి: శామీర్పేట్ కారిడార్పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
ఈ వేడుకలకు ఖిల్లాను పూలు, మొక్కలతో ఎంతో అందంగా తీర్చిదిద్దేవారు. అయితే కరోనా (Corona) వచ్చినప్పటి నుంచి వేడుకలను ఇందులో నిర్వహించడం బంద్ చేశారు. మళ్లీ ఖిల్లా పూర్వ వైభవం కోల్పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.