Kamareddy: మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల ఆందోళన.. కలెక్టర్‌ ఏమన్నారంటే! | Kamareddy Collector Farmers Protest Over Master Plan | Sakshi
Sakshi News home page

Kamareddy: మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల ఆందోళన.. కలెక్టర్‌ ఏమన్నారంటే!

Jan 5 2023 8:07 PM | Updated on Jan 6 2023 9:20 AM

Kamareddy Collector Farmers Protest Over Master Plan - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ స్పందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వచ్చి వినతిపత్రం ఇవ్వచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా  నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. వాటిని పరిగణనలోకి తీసుకుంటాని తెలిపారు. అలాగే కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్‌ ముందు రైతులు నిరసన విరమించారు. కలెక్టర్‌ దిష్టిబొమ్మను రైతులు దగ్దం చేశారు. కలెక్టర్‌ దిష్టిబొమ్మకు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డి బంద్‌కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కాగా అంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హెటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ ముందు టెంట్‌ వేసి రైతులు ధర్నా చేపట్టారు. ఆందోళన విరమించి., బృందాలుగా లోపలికి రావాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కోరినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ బయటకు రావాల్సిందేనని పట్టుబట్టారు.

కాగా కామారెడ్డి బల్దియాలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రీయల్‌ జోన్‌ కింద చూపడం, అవసరం లేని చోట్ల 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం.. మాస్టర్‌ ప్లాన్‌ నుంచి విముక్తి కోసం రైతులు తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అయితే మాస్టర్‌ ప్లాన్‌లో భూమి పోతుందని మనస్తాపంతో సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో రైతులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. 
చదవండి: KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement