విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు | Investigation Speedup In Terror Conspiracy Case | Sakshi
Sakshi News home page

విజయనగరం ఉగ్రమూలాల కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు

May 20 2025 7:30 AM | Updated on May 20 2025 8:35 AM

Investigation Speedup In Terror Conspiracy Case

సౌదీ హ్యాండ్లర్‌ ఆదేశాలతో పేలుళ్ల కోసం ప్రయోగాలు 

ఏపీలో రిహార్సల్స్‌  

 కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారితో కలిసి సిరాజ్, సమీర్‌ ఇన్‌స్టా గ్రూప్‌ 

హైదరాబాద్‌లో రహస్య సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహా్మన్, హైదరాబాద్‌ బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ భారీ విధ్వంసానికి ప్లాన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, మహా రాష్ట్ర యువకులు సైతం వీరి గ్యాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. వీరంతా ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమై బాంబుపేలుళ్ల కుట్రలకు సంబంధించి పలు అంశాలు పంచుకున్న ట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా సిరాజ్, సమీర్‌లను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

విజయనగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రలింకుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సైతం రంగంలోకి దిగారు. సోమవారం విజయనగరం వెళ్లి స్థానిక పోలీసులు, ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. సౌదీ హ్యాండ్లర్‌ నుంచి వచి్చన ఆదేశాల మేరకు భారీ పేలుళ్ల కుట్రకు తెరతీసినట్టు కీలక ఆధారాలు ఉండటంతో ఎన్‌ఐఏ ప్రత్యేకంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. 

ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపు 
ఈ కుట్రలో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు కలిపి మొత్తం ఆరుగురు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా ఇన్‌స్టా్రగామ్‌లో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకోగా.. సౌదీ హ్యాండ్లర్‌ అన్ని కీలక విషయాలను వీరి గ్రూప్‌ కు పంపుతున్నాడు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లో సమీర్‌ సహాయంతో ఒక రహస్య ప్రాంతంలో 3 రోజులపాటు గడిపినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

 ఇందు లో ప్రధానంగా బాంబుల తయారీ, అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలు, డమ్మీ బ్లాస్టులు చేయడం, ఆ తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిని కలవాలి, తదుపరి కార్యాచరణ వంటి అనేక విషయాలు చర్చించుకున్నారు. సమీర్, సిరాజ్‌కు బాంబుల తయారీ పదార్థాల కొనుగోలు, తయారీ బాధ్యతను హ్యాండ్లర్‌ అప్పగించాడు. యూట్యూబ్‌లో వీరిద్దరూ బాంబుల తయారీ విధానం చూసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని, విజయనగరానికి చెందిన సిరాజ్‌కు ఆ బాధ్యత అప్పగించారు. 

టిఫిన్‌ బాక్స్‌ బాంబులు తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు అవసరమైన టిఫిన్‌ బాక్సులు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ అమెజాన్‌లో ఆర్డర్‌ చేసినట్లు తేలింది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు రిహార్సల్స్‌ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తరువాత వరుస పేలుళ్లకు కుట్ర చేసినట్టు గుర్తించారు.  

సమీర్‌ గురించి ఆరా.. 
సికింద్రాబాద్‌లో లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న సమీ ర్‌.. బోయిగూడ రైల్‌ కళారంగ్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉంటూ ఇన్‌స్టా్రగామ్‌ గ్రూప్‌ ద్వారా ఇతర నిందితులకు, సౌదీలోని హ్యాండ్లర్‌కు టచ్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్‌ కేంద్రంగా మిగిలిన ఆరుగురు సభ్యులకు షెల్టర్‌ ఇవ్వడం.. బాంబుల తయారీలో సిరాజ్‌కు సహకారం అందించడంలో కీలకంగా ఉంటున్నాడు.  సమీర్‌ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవాడు.. సమీర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న వారు ఎవరు అన్న విషయాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తోంది.    

Advertisement
 
Advertisement
Advertisement