
రాష్ట్ర యువతలో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగం
2016లో 22 ఏళ్ల వారిలో ప్రతి 10 మందిలో ముగ్గురులో నెట్ వాడకం
2023 నాటికి మూడు రెట్లు పెరుగుదల
అదే కాలానికి టెన్త్, ఇంటర్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం
బాల్య వివాహాలు, త్వరగా తల్లులైన వారిలోఇంటర్ చదివిన వారు 15 శాతమే
యంగ్ లైవ్స్ రౌండ్ 7 సర్వేలో వెల్లడించిన సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర యువతలో ఇంటర్నెట్ వాడకం భారీ స్థాయిలో పెరిగినట్లు ‘ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్’యంగ్ లైవ్స్ రౌండ్ 7 పేరిట నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2016లో 22 ఏళ్ల వయస్కుల్లో ప్రతి 10 మందిలో ముగ్గురు ఇంటర్నెట్ వాడగా 2023 నాటికి వారిలో ఏకంగా 8 మంది ఇంటర్నెట్ వాడినట్లు సర్వే పేర్కొంది.
అలాగే 2023లో 22 ఏళ్ల వయసు వారిలో నెట్ వాడకం మూడు రెట్లు పెరిగిందని.. ప్రతి 10 మందిలో 9 మంది ఇంటర్నెట్ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు సర్వే తెలిపింది. 2016లో ఇంటర్నెట్ వినియోగం పేదల్లో 6 శాతం ఉంటే ఇప్పుడది ఏకంగా 86 శాతానికి పెరిగినట్లు సర్వే గుర్తించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి దేశంలో రోజువారీ డిజిటిల్ కార్యకలాపాల వాడకాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చిందని సర్వే అభిప్రాయపడింది.
అయితే కంప్యూటర్ వినియోగం మాత్రం సంపన్నుల్లోనే కొనసాగుతోందని వివరించింది. విద్యార్హతలు పెరిగినా వారిలో సమగ్రంగా చదవడం మాత్రం పెరగలేదని సర్వే అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వెనుకబాటు ఉన్న ఎస్సీ, ఎస్టీ, ప్రతికూలతలు ఉన్న సామాజిక వర్గాలు, బాల్యవివాహాలు చేసుకున్న వారు ఉన్నత విద్యను ఇంకా అందుకోలేకపోతున్నారని ‘సెస్’నివేదిక స్పష్టం చేసింది.
టెన్త్, ఇంటర్ వారిలో పెరుగుదల..
రాష్టంలో విద్యారంగం వేగంగా మారుతోంది. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసుకుంటున్న యువత శాతం గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో యూనివర్సిటీల్లో చేరికలు కాస్త తక్కువగా ఉంటుండగా బాల్య వివాహాలు చేసుకుంటున్న వారు చదువుకు దూరమవుతున్నారు. ఏడేళ్ల వయసు తేడా ఉన్న యువతను లక్ష్యంగా చేసిన ఈ సర్వేను ‘సెస్’నిర్వహించింది. 2016 22 ఏళ్ల వారిని, 2023లో 22 ఏళ్ల వారిని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు.
పదో తరగతిలో..: ఈ సర్వే ప్రకారం పాఠశాల విద్యలో విద్యార్థులు పురోగతి సాధించారు. సెండరీ విద్య పూర్తి చేసిన వారు 2016లో 74 శాతం మంది ఉంటే అది 2023 నాటికి 83 శాతానికి చేరింది. అలాగే హయ్యర్ సెకండరీలో 53 శాతం నుంచి 61 శాతానికి పెరిగిందని సర్వే వెల్లడించింది. ఈ రెండు దశల్లోనూ ఉత్తీర్ణతలో లింగభేదం పెద్దగా లేదని సర్వే వివరించింది.
ఇక యూనివర్సిటీ స్థాయి విద్యలో 10 % ఎన్రోల్మెంట్ పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహాలు చేసుకున్న వారు లేదా త్వరగా తల్లులైన వారిలో హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేసిన వారు 15 శాతం మాత్రమేనని.. అదే ఆలస్యంగా వివాహాలు చేసుకున్న వారు 67 శాతం మంది ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్నట్లు సర్వే తెలిపింది.
ఉన్నత విద్య..
గ్రామీణులకు ఉన్నత విద్య పట్టణాల్లోని వారితో పోలిస్తే అంతగా అందుబాటులో లేదని సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని వారికి 65 శాతం యూనివర్సిటీలు అందుబాటులో ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 43 శాతమే అందుబాటులో ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే ఆర్థిక స్తోమతపరంగా చూస్తే సంపన్నులకు 66 శాతం, పేదలకు 38 శాతమే అవకాశాలున్నాయని వివరించింది.
సామాజిక రంగాలవారీగా చూస్తే ఎస్సీలకు 42 శాతం అవకాశాలు ఉంటే ఇతర వర్గాలకు 68 శాతం ఉన్నత విద్య అందుబాటులో ఉన్నట్లు సర్వే తేల్చింది. గత ఏడేళ్లలో దిగువ తరగతి వారిలో హయ్యర్ సెంకడరీ పూర్తి చేసిన వారి నిష్పత్తి 2016లో 40 శాతంగా ఉంటే అది 2023 నాటికి 54 శాతానికి పెరిగినట్లు సర్వే వివరించింది.
యూనివర్సిటీ ఎన్రోల్మెంట్లో వారి సంఖ్య 27 శాతం నుంచి 38 శాతానికి పెరిగినట్లు తెలిపింది. అదే ఎగువ తరగతి వారిలో యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ 61 శాతం నుంచి 66 శాతానికి పెరిగినట్లు సర్వే గుర్తించింది.