Telangana: Inter admissions to start from May 15; classes from June 1, 2023 - Sakshi
Sakshi News home page

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు 

Published Sat, May 13 2023 3:37 AM

Intermediate classes from June 1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ శుక్రవారం విడుదల చేశారు.

జూన్‌ 30లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని,ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు జూన్‌ 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని కాలేజీలకు సూచించారు. టెన్త్‌ గ్రేడింగ్‌ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించారు. ఇంటర్‌ బోర్డ్‌ గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఆ కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని సూచించారు.

ప్రతీ కాలేజీ రిజర్వేషన్‌ పాటించాలని ఆదేశించారు. సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం కేటాయించాలన్నారు. ప్రతీ కాలేజీ బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను బోర్డ్‌ విడుదల చేసింది. 

మార్గదర్శకాలు ఇవీ... 
ఇంటర్‌లో ప్రతీ సెక్షన్‌లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు నిర్వహించాలంటే కాలేజీ విధిగా బోర్డ్‌ అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏ కాలేజీ వ్యవహరించినా కఠిన చర్యలుంటాయి.  
 విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పకుండా నమో దు చేయాలి. అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాలి. ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని మిగిలి ఉన్నాయి? అప్‌డేట్‌ సమాచారం బోర్డ్‌పై ప్రదర్శించాలి.  
 జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్‌ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను కాలేజీలే క ల్పించాలి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement