యువకుడికి తీవ్ర గాయాలు
మద్యం మత్తులో గూడ్స్రైలు
బోగీల మధ్య కూర్చుని ప్రయాణం
యువకుడిని దింపుతున్న పోలీసులు
హైదారాబాద్, కాచిగూడ: తల్లిదండ్రులతో గొడవపడి నగరానికి వచ్చిన ఓ ఏసీ మెకానిక్ మద్యం మత్తులో గూడ్స్ రైలు ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన మేరకు.. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కేసరి పవన్ (23) తల్లిదండ్రులతో గొడవపడి శనివారం రాత్రి నగరానికి వచ్చాడు. మద్యం మత్తులో మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు ఎక్కాడు. గూడ్స్ రైలు రెండు భోగీల మధ్య కూర్చుని ఫలక్నుమా రైల్వే స్టేషన్ వరకు చేరుకున్నాడు.
రైలు ఫలక్నుమా రైల్వే స్టేషన్లో ఆగడంతో రైలు బోగీ ఎక్కి విద్యుత్ హైటెన్షన్ వైర్లను పట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


