ఉప్పల్‌ నుంచి నేనే పోటీలో ఉంటా | I am competition BRS Uppal MLA Bethi Subhash Reddy | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌ నుంచి నేనే పోటీలో ఉంటా

Aug 17 2023 1:31 PM | Updated on Aug 17 2023 1:32 PM

I am competition BRS Uppal MLA Bethi Subhash Reddy  - Sakshi

హైదరాబాద్: ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.. ఉప్పల్‌ నుంచి తిరిగి నేనే పోటీలో ఉంటానని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీ కోసం.. మీ ఎమ్మెల్యే పాదయాత్ర బుధవారం 27వ రోజు డాక్టర్‌ ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌లో కొనసాగింది. డివిజన్‌ పరిధిలోని కమలానగర్, మహేశ్‌నగర్, పంచవటికాలనీ, శ్రీనివాసనగర్, అరూల్‌కాలనీ, ఏఎస్‌రావునగర్, అణుపురం కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది.

 మూడు రోజుల పాటుగా సాగిన పాదయాత్రలో గుర్తించిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం అణుపురం కమ్యూనిటీహాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ తిరిగి ఉప్పల్‌ నుంచి తానే బరిలో ఉండబోయేదని, అందులో సందేహం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షాలకు పిచ్చెక్కిపోతోందన్నారు. దిక్కుతోచని స్థితిలో రెండు లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్లు వంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ ఆ పథకాలన్నీ ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న వాస్తవాలను ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. 

ఉప్పల్‌లో కారిడార్‌ నిర్మాణం చేయకుండా చేతులెత్తేసిన పార్టీ నాయకులే పనులు నిలిచిపోయాయంటూ ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. జమ్మిగడ్డ శ్మశానవాటికకు సంబంధించి స్థల యజమానులతో మాట్లాడమని త్వరలోనే ఆ సమస్య కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీరెడ్డి, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, సుడుగు మహేందర్‌రెడ్డి, డప్పు గిరిబాబు, బోదాసు రవి, మురళిపంతులు, సీతారాంరెడ్డి, మల్కా రమాదేవి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement