
సాక్షి, మాదాపూర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది.
వివరాల ప్రకారం.. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, నివాసాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇక, 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను సైతం హైడ్రా తొలగిస్తోంది. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా హెచ్చరించింది.
కూల్చివేతల సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతల అక్రమం. మేము రిజిస్టర్ చేసుకున్న భూములు ఇవి. 1956 నుండి మాకు పత్రాలు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కో-ఆపరేటివ్ సోసైటీ విక్రయిస్తేనే కొనుగోలు చేశాం. ప్రతీ ఏడాది జీహెచ్ఎంసీకి పన్ను కడుతున్నాం. మరి హైడ్రా ఏ విధంగా మా భూములు లాక్కుంటుంది. మాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ కబ్జా చేసి కట్టిన వారిని ఏమనడం లేదు. కోర్టులో పోరాడుతున్నవారిని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్కి ప్రభుత్వమే ఇది 15 ఎకరాలు సున్నం చెరువు అని రిపోర్ట్ ఇచ్చారు. చెరువు అల్లాపూర్ బాలానగర్లో ఉండగా శేరిలింగంపల్లిలో ఉన్నట్లు చూపిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మాదాపూర్లో గల సున్నం చెరువు నీరు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ చెరువు నీటిలో పరిమితికి మించి ఏకంగా 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు తేలింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సహకారంతో చెరువులోని నీటి నమూనాలను సేకరించి, శాస్త్రీయంగా పరీక్షించింది. ఈ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. సున్నం చెరువు నీరు తీవ్రంగా కలుషితమైంది. అత్యంత హానికరమైన సీసం (లెడ్) పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నీటిని తాగవద్దని, కనీసం రోజువారీ అవసరాలకు కూడా వినియోగించవద్దని హైడ్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక, హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రధాన చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సున్నం చెరువుపై దృష్టి సారించింది.