‘పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు’ | Hyderabad: Ktr Slams Congress Party And Bjp In Assembly Over Their Comments | Sakshi
Sakshi News home page

‘పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు’

Feb 11 2023 5:15 AM | Updated on Feb 11 2023 10:40 AM

Hyderabad: Ktr Slams Congress Party And Bjp In Assembly Over Their Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌ను పేల్చేయాలంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, తాజ్‌మహల్‌ను పోలిన సచివాలయ గుమ్మటాలను కూలుస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘నిన్న ఒకాయన ప్రగతిభవన్‌ను కూలగొడతానన్నాడు.. ఇవాళ ఇంకొకాయన సెక్రటేరియట్‌ను కూలగొడతానంటున్నాడు.

మేమేమో నిర్మాణాలు చేద్దాం.. పునాదులు తవ్వుదాం అంటుంటే ఒకాయనేమో సమాధులు తవ్వుతానంటాడు. ఇంకొకాయన బాంబులు పెట్టి పేలుస్తానంటాడు. ఈ అరాచక శక్తుల చేతుల్లో రాష్ట్రం పడితే ఏమవుతుందో ఆలోచించాలని మిత్రులందరినీ అడుగుతున్నా. పచ్చగా ఉన్న తెలంగాణ, పచ్చని మాగాణంగా మారిన తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. పేలుస్తాం.. కూలుస్తామనే అరాచక మాటలు తప్ప నిర్మాణాత్మకమైన వైఖరి లేని పారీ్టలను తిరస్కరించాలని కూడా ప్రజలను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.  

తెలంగాణపై కేంద్రం వివక్ష... 
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో 157 మెడికల్‌ కాలేజీలు, 157 నర్సింగ్‌ కాలేజీలు ప్రకటించిన కేంద్రం... రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. 2020లో హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని.. కానీ గుజరాత్‌లో వరదలు సంభవిస్తే ప్రధాని విమానంలో వెళ్లి రూ. వెయ్యి కోట్లు అందించారన్నారు. మోదీ గుజరాత్‌కే ప్రధానా? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? అని కేటీఆర్‌ నిలదీశారు.

మరోవైపు తాము స్టార్టప్‌ అంటుంటే కేంద్రం మాత్రం కంపెనీలకు ప్యాకప్‌ చెబుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలకు వెన్నెముక లేదని.. పసుపు బోర్డు తెస్తానని చెప్పిన వాళ్లు దాని ఊసెత్తడంలేదన్నారు. హుజూరాబాద్‌కు మెడికల్‌ తెప్పించాలంటూ బీజేపీ సభ్యుడు ఈటలకు సవాల్‌ విసిరారు. ‘రాజేందర్‌ అన్నా.. మీరు ఉద్యమ బిడ్డ, రోషమున్న తెలంగాణ బిడ్డ. కేంద్రంలో మీ పారీ్టతో కొట్లాడి రాష్ట్రానికి ఏమన్నా పట్టుకొస్తే చప్పట్లతో స్వాగతం పలుకుతాం’’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

మోదీకి నోబెల్‌ ఇవ్వాలి.. 
ఔషధాల తయారీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌కు కేంద్రం బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఇవ్వకుండా.. ఒక్క ఫార్మా కంపెనీ కూడా లేని యూపీకి బల్క్‌ డ్రగ్క్‌ పార్క్‌ ఇచి్చందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ను ప్రధాని మోదీ కనిపెట్టారని వాళ్ల మంత్రి అంటున్నారని.. అందువల్ల మోదీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేద్దామని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement