సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామంటూ రైల్వేకు లేఖ రాసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కాగా, ఈ పథకం అమలుపై సీఎస్.. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం.. దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాయగా.. తెలంగాణ సర్కార్ లేఖపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ఎంవోయూ పంపించాలని.. పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని వెల్లడించింది.
మరోవైపు, యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఇటీవల ఈ ప్రాజెక్టు టెండర్లను దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు.
తొలుత రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టాయి. భూమి, వనరులు, అవసరమైన నిధులను అందజేసేందుకు అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇది పెండింగ్ జాబితాలో పడింది. చివరకు రైల్వేశాఖే సొంత నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా నిధులు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరి వరకు 33 కి.మీ. మేర రూ.430 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. కొత్తలైన్లను నిర్మించడంతో పాటు అవసరమైన చోట్ల డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ తదితర పనులు చేపట్టనున్నారు.


