హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి | Hyderabad court awards death sentence to siblings in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి

Jun 9 2026 7:19 AM | Updated on Jun 9 2026 7:19 AM

Hyderabad court awards death sentence to siblings in murder case

మల్కాజిగిరి: ఏడేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో కొడుకు, కూతురుకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. హతుడి భార్య గంగాబాయి(65)కి వయసురీత్యా జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కొడుకు కిషన్‌ (47) కూతురు ప్రపుల్ల (36)కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జి వి.బాలభాస్కర్‌ రావు తీర్పు వెలువరించారు. సోమవారం మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టకు చెందిన కిషన్‌ మారుతీ సుతార దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్‌ ట్రైన్‌ డ్రైవర్‌గా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకుని మల్కాజిగిరిలో ఎన్‌ఏ కృష్ణానగర్‌లో ఇల్లు కొనుగోలు చేశాడు. 

అక్కడ భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లతో నివాసముంటున్నాడు. మరో కూతురు అనుపమ వివాహం కావడంతో వేరుగా ఉంటున్నది. కిషన్‌ ఖాళీగా ఇంటి వద్దనే ఉంటూ తన జల్సాలకు డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. అతనికి సోదరి ప్రపుల్ల, తల్లి గంగాబాయి వత్తాసు పలికేవారు. ప్రపుల్ల కూడా పీజీ చేసినా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో తండ్రి మందలించేవాడు. ఇది వారికి నచ్చలేదు. పింఛను మొత్తాన్ని కూడా ప్రపుల్ల పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడంతో మారుతీ ఒప్పుకోక పోవడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు.

 తండ్రిని చంపడానికి ప్రపుల్ల యూట్యూబ్‌లో చూసి ఒక పథకం రచించి విషయాన్ని తల్లి, సోదరుడుతో పంచుకొంది. ఉమ్మెత్త చెట్టు గింజలను నూరి ఆ పొడిని ఆహారంలో కలిపి విషప్రభావంతో చనిపోయేలా చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి బయట నాలాలో పడేద్దామని చెప్పింది. ఆవిధంగా పలుమార్లు ఆహారంలో ఉమ్మెత్త చెట్టు గింజల పొడిని ఆహారంలో కలిపి మారుతీకి ఇవ్వగా 2019 ఆగష్టు 16న మృతి చెందాడు. 

మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో ఉంచి పూజగదిలో దాచివుంచారు. జన సంచారం ఉండటంతో రెండు రోజులు అలాగే ఉంచారు. దుర్వాసన రాకుండా అగరబత్తీలు వెలిగించి, సెంట్‌ చల్లి జాగ్రత్తపడ్డారు. జనసంచారం తగ్గడంతో 18వ తేదీన బయటకు తీసుకొని రావడంతో ఒక్కసారిగా దుర్వాసన వచి్చంది. దీంతో స్థానికులు గుమిగూడటంతో విషయం బయటపడ్డది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సోమవారం తీర్పు వచి్చంది. 

Advertisement
 
Advertisement
Advertisement