
రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ తదితరులకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని ఆపి వేయడంతో పాటు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీజీఐఐసీతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.
తాజాగా గురువారం మరో పిటిషన్ కూడా దాఖలయ్యింది. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిందని, చెట్ల నరికివేతపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను వెంటనే నివేదిక అందజేయాలని ఆదేశించిందని చెప్పారు.
పిటిషనర్లు పిల్లు దాఖలు చేసి అభివృద్ధి పనులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలతో రూ.50 వేల కోట్ల విలువైన పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ కంపెనీలు రావడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, గత 20 ఏళ్లుగా కంచ గచ్చిబౌలి సమీపంలో వివిధ సంస్థలకు, కంపెనీలకు భూములు కేటాయించినప్పుడు ఎవరూ ఎలాంటి నిరసన తెలపలేదని నివేదించారు. చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధరకు వేల కోట్ల విలువైన భూమిని బిల్లీ రావుకు కట్టబెట్టారని చెప్పారు.
స్టే ఇచ్చినా ఆగని పనులు
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు బుధవారం స్టే ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా పనులు కొనసాగాయన్నారు. గురువారం ఉదయం వరకు చెట్ల తొలగింపు పనులు ఆపలేదని చెప్పారు. దీన్ని వీడియోలు, ఫొటోలు తీసేందుకు యత్నించిన ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
వాదనల అనంతరం ధర్మాసనం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శులకు, టీజీఐఐసీ, హెచ్సీయూ రిజిస్ట్రార్ , కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యా శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
హెచ్సీయూను సందర్శించిన రిజిస్ట్రార్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ హెచ్సీయూలో పర్యటించారు. దాదాపుగా ఐదు కిలోమీటర్లు కాలినడకన పర్యటించి వివరాలు సేకరించారు. అంతకు ముందు బారికేడ్లతో విద్యార్థులను ఈస్ట్ క్యాంపస్కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు రిజిస్ట్రార్ రాకతో వాటిని తొలగించారు. జేసీబీలు సైతం మాయమయ్యాయి. రిజిస్ట్రార్ను కలిసిన ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ధ్వంసం చేసిన ప్రదేశాన్ని చూపించారు. రిజి్రస్టార్ వెళ్లగానే పోలీసులు తిరిగి ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు.