అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళులు  | Governor Tamilisai Pays Tribute To DR BR Ambedkar At Raj Bhavan | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళులు 

Dec 7 2022 1:42 AM | Updated on Dec 7 2022 1:42 AM

Governor Tamilisai Pays Tribute To DR BR Ambedkar At Raj Bhavan - Sakshi

రాజ్‌భవన్‌లో అంబేడ్కర్‌ చిత్రపటానికి అంజలి ఘటిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్‌భవన్‌లో అంబేడ్కర్‌ చిత్రపటానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. ట్యాంక్‌బండ్‌పైనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, ప్రజాగాయకుడు గద్దర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్, తెలంగాణ వైద్యసేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర బెవరేజస్‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గజ్జెల నాగేశ్, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, బహుజన సమాజ్‌ పార్టీ, మాలమహానాడు నాయకులు తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రధాని నరేంద్రమోదీ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పర్యాటకులు, అభిమానులు సందర్శించడానికిగాను పంచతీర్థ పేరుతో ఏప్రిల్‌ 14న నూతన రైలును ప్రారంభిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో నడిచే రాజ్యాంగం అంబేద్కర్‌ది కాదని, ఇక్కడ కేసీఆర్‌ రాజ్యాంగమే నడుస్తోందని షర్మిల ఆరోపించారు.  పంజగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని వి.హనుమంతరావు రెండు గంటలపాటు మౌనదీక్ష చేపట్టారు. కాగా, బీజేపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, నాయకులు రావుల రాజేందర్‌ నివాళులర్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement